కార్తీక మాసం

కార్తీక మాసం

Tuesday 27 January 2015

అన్నలూ తప్పక చూడండి:

           ఈ రోజు ఈటివిలో ప్రసారమైన ఝుమ్మంది నాదం కార్యక్రమం ప్రతీ అన్న,చెల్లెలు చూసి తీరాలి.బాలు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ పెళ్ళి చిత్రంలోని పాట "చెల్లివైనా తల్లివైనా చామంతి పువ్వంటి నువ్వే,నాకు నువ్వే"శ్రీ కృష్ణ అద్భుతంగా ఆలపించాడు.సాహిత్యమంతా విన్న వాళ్ళకి కన్ను చెమ్మగిల్లక మానదు.అదే వేదికపై బాలు,శైలజ గార్ల అనుబంధాలు,వారి చిలిపి అల్లరి,"అన్న అంటే అన్న ప్రశ్నకి శైలజ నాన్న అని "సమాధానం చెప్పినపుడు చెప్పనలవికాని బాధ కలిగింది.అందుకు బాలూ గారూ మురిసిపోయారు.అది వేరే విషయం. ఇప్పటి రోజుల్లో ఒక అన్న చెల్లి "నాకు నాన్న లేరు కదా నువ్వే కదా నాకు అన్నీ అని అంటే" ఆ అన్న చెప్పినదేమిటో తెలుసా,"నాకేం సంబంధం,నేను కన్నవారికి మాత్రమే నేను బాధ్యుడను.నిన్ను నాన్న కన్నారు,ఇప్పుడు ఆయన లేరు,నాకేం సంబంధం లేదు అని.ఆ చెల్లి ఆ అన్న ఆస్తులేమీ అడగలేదు అక్కడ.నాన్న ఇచ్చే ఓదార్పే అడిగింది.ఆ చెల్లి అటువంటి అన్నలకి అన్నీ చేసింది.అప్పుడు ఆ చెల్లి నాకేమి సంబంధం అమ్మ కదా మిమ్మల్ని కన్నది అని అడుగలేదు. ఈ రోజు చెల్లి ఆ అన్న పై మాట అన్నపుడు అంటే దానికి కూడా ఆ అన్న చాలా తెలివిగా సమాధానం చెప్పాడు.ఏమని అంటే ఇంటిలో ఆడపిల్లవి కదా పనులు నేర్చుకోవాలి కనుక అందులో భాగంగా చేశావైనా అవన్నీ, నువ్విపుడు అడుగకూడదని ఆ చెల్లిని దూరంగా పెట్టేశారు.అన్నలే అనుకుంటే పరవాలేదు ఆ చెల్లిని కన్న తల్లి కూడా స్వార్ధంతో బిడ్డను దూరంగా పెట్టింది.ఆ బిడ్డ మెట్టినిల్లు చేరేవరకూ అనారోగ్యపరురాలైన తనుకు చేసిన సపర్యలు కూడా మరిచిపోయింది.ఆడపిల్లవికనుక పనిపాటలు నేర్చుకునే పనిలో భాగంగా మాకు చేశావ్ అని నిర్ధయగా మాట్లాడింది.ఆ కూతురు ఆ తల్లి మాటలు విని జీవితంలో చాలా కోల్పోయింది.ఏమిటో ఆ తల్లికి తెలుసు.కానీ ఒప్పుకోదు.కారణం స్వార్ధం. ఆమే ఎప్పుడూ చెప్తూ ఉండేది "కలికాలం,కడిగేసుకుపోయే కాలమని".దానికి ఆమె కూడా తలవంచింది. 

        ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లోకమంతా పైవిధంగా లేదని బాలూ గారు,శైలజగార్లను చూస్తే అర్ధమైంది.పోనీలే కొంతైనా నీతి,నిజాయితీ,ప్రేమలు,అనుభంధాలు మిగిలిఉన్నాయని అనిపించి కళ్ళు చెమ్మగిల్లినయ్.

        పైన చెప్పిన అన్నలు,చెల్లి,తల్లి కధకు భిన్నమైన కధ మరో పోస్టులో తెలిసికుందాం.ఇప్పటి వరకూ కల్తీ లేని ప్రేమ తల్లి ప్రేమ అని నమ్మినవాళ్ళకి పైన చెప్పిన యదార్ధ సంఘటనే, లేదు తల్లి ప్రేమ కూడా కల్తీనేనని రుజువు చేసింది.

        అందరూ మళ్ళీ తప్పకుండా చూడండి ఆ కార్యక్రమాన్ని.   

ఙాపకాల దొంతరలు:

     ఇంతకుముందే చదివా "ఆలోచనలు"బ్లాగులో 'మా పల్లె అందాలూ శీర్షిక. చాలా బాగుంది. అసలు పల్లెలే అందంగా ఉంటాయ్ కదా. అలా అందరం మన మన పల్లె అందాలు వ్రాస్తూ పోతేనన్నా ఈతరానికి పల్లెల అందమేమిటో,మనం కోల్పోయిన అనుభవాలు,అనుభూతులు,ప్రేమలు,ఆప్యాయతలు తెలుస్తాయేమో.

    నిజంగా మా అమ్మమ్మగారి ఊరు కూడా చాలా బాగుండేది. మాది మచిలీపట్నం దగ్గర కలపటం అనే చిన్న గ్రామం. అందులో ఇళ్ళుకూడా చాలా తక్కువ వుండేవి. అన్ని కులాల వారూ కలసి ఉండేవారు. తాతగారు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. ముగ్గురు తాతల ఇళ్ళు పక్క పక్కనే వరుసగా ఉండేవి. సంక్రాంతి పండుగకి ఎక్కువరోజులు ఉండేవాళ్ళం మేము. మా తాతగారే పెద్దవారు కనుక మొదలు మా ఇల్లే వుండేది. సంక్రంతి నెల పట్టినదగ్గరనుంచీ పిన్నీ వాళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు. రోజూ గొబ్బిళ్ళు పెట్టేవారు.అవికూడా ఒకటి రెండూ కాదు.ముప్పై,నలభై చేసేవారు. అంత పెద్ద వాకిలిలో పెద్ద మెలికల ముగ్గు,దాని నిండా పసుపు కుంకుమ,గొబ్బిళ్ళు.వాటికి అగరుబత్తి వెలిగించి బెల్లం,ధాన్యం నైవేద్యంగా పెట్టేవారు.నేను మా పిన్నులచుట్టూ తిరుగుతూ చాలా ఆసక్తిగా ఆలకించేదాన్ని.మద్యహ్నం నుంచీ పిండి వంటల చర్చలు మొదలయ్యేవి.ఈ రోజుల్లోలా కేజీ,రెండు కేజీలు కాదు ఆరోజుల్లో పది,పదిహేను కేజీలు బియ్యం పోసి,నానిన తరువాత దొడ్లోనే రోకళ్ళతో పిండి కొట్టే వారు. ఒకరోజు మా అమ్మమ్మ వాళ్ళింట్లో మరుసటి రోజు ఇంకొకరింట్లో,అలా ముగ్గురిళ్ళలో ఎక్కడచూసినా పిండివంటల వాసనలే. అన్నీ ఇంట్లోవే. దేనికీ బయటకు వెళ్ళే అవసరం వుండేది కాదు. వండిన పిండివటలను భోషాణంలో సర్దించేవారు తాతగారు.దాని తాళాలు ఆయనదగ్గరే ఉండేవి.రోజుకి ఒకసారే తాళం తీసి కావలసినంత బయట ఉంచేవారు. బోగి రోజుకల్లా పొలందగ్గరనుంచీ పెద్ద బల్ల తెప్పించేవారు. బొమ్మలకొలువుకు సిద్దంచేపించేవారు. ఎన్ని బొమ్మలో. నేను కొత్తబొమ్మలు కావాలని మారాం చేస్తే అమ్మమ్మ వడ్లు పోసి కొని ఇచ్చేది. అలా చాల బొమ్మలు కొనిపించుకున్నా. ఈ బెజవాడ పిల్లవస్తే ఉన్నచోట ఉండదు,కర్చు పెట్టిస్తదని,సొమ్ము మీ నాన్న దగ్గరనుంచీ తీసికుంటామని అనేది. పండుగైనతరువాత తిరిగి వచ్చేటపుడు బొమ్మ లివ్వమంటే అస్సలు ఇచ్హేది కాదు. మళ్ళీ సంవత్సరం వస్తావుగా అప్పుడు కావాలిగా అని, అన్నీ బుట్టకెత్తించి పైన అటకెక్కించేది అమ్మమ్మ. అమ్మమ్మతో పాటే అన్నీ పొయాయ్.ఏ మైనావో కూడా తెలియదు. అత్తావాళ్ళు వచ్చినతరువాత ఇంటి పరిస్తితులు మారి,వెళ్ళడం తగ్గి పోయింది. వెళదామన్నా మా అమ్మా వాళ్ళే "ఆ ఎవరున్నారు,ఏముందక్కడ,అంతా మా పెద్దవాళ్ళతోనే పోయిందని" నిరుత్సాహపరుస్తారు. వాళ్ళకే లేనపుడు మేమెలా వెళ్ళగలం.కానీ ఆ ఙాపకాలు డిసెంబర్ వస్తేచాలు నన్ను వెంటాడుతూనే ఉంటాయ్. అక్కడకెళ్ళకపోయినా ఆ నెలరోజులూ ముగ్గులు వెయ్యటం,పండుగ మూడు రోజులూ గొబ్బిళ్ళు పెట్టటం చేస్తా. కొన్నాళ్ళు వారు విసుక్కున్నారు. ఇపుడు ఈమె ఇంతేనని సహకరిస్తున్నారు. నా పిల్లలు చేయకపోయినా నేను చేసుకుని,అవి చూసి మురిసిపోతుంటా.  

    మా ఊరు కూడా పచ్చని పొలాలతో చిన్న చిన్న చెరువులు,దాని నిండా తామరలతో చాలా అందంగా ఉండేది, మా అమ్మమ్మవాళ్ళ వీధి చివర రామాలయం ఉండేది. తాతగారువాళ్ళకే చాలా పెద్ద పసువుల కొట్టం ఉండేది. పాలు,నెయ్యి,పెరుగు సంవృద్దిగా ఉండేవి. పెరట్లో కాసిన కూరగాయలతోనే కూరలు.పొలమునుండీ కూడా తెచ్చేవారు. ఏవీ కొనే పని ఉండేది కాదు. గుడ్లు కూడా ఇంటిలోనివే,అన్ని కోళ్ళు ఉండేవి. ముగ్గురు తాతగారి ఇళ్ళలోవాళ్ళం కలిస్తే దగ్గర దగ్గర యాబై మందిమి అయ్యేవాళ్ళమేమో.అర్దరాత్రిదాకా కధలు,కబుర్లు,ఆటలు,పాటలు.పెద్దవాళ్ళు పగలంతా పనిచేసి ఆదమరిచి నిదర్లు పోయేవారు. అప్పట్లో కిరోసిన్ దీపాలు.మేము మా లోగిట్లో కూర్చుంటే వెన్నెల తెల్లగా పట్ట పగలులా వుండేది. ఏ భయాలు ఉండేవి కాదు.ఎంత ఆలస్యంగా పడుకున్నా పొద్దునే అందరూ విధిగా లేచి ఎవరి పనులలోకి వారు వెళ్ళి పోయేవాళ్ళు. అంత క్రమశిక్షణ ఉండేది. అరుపులు,కేకలు ఉండేవి కాదు. ఎవరి పనులు వారు టైంకి పూర్తి చేసే వారు.

     పండుగ మూడు రోజులముందు నాన్న వచ్చే వారు. నాన్న అంటే అందరికీ భయంగా ఉండేది.(అప్పుడు భయమను కున్నా,అది గౌరవం అని పెద్దైనాక తెలిసింది)వస్తూ నాన్న కొత్త బట్టలు తెచ్చేవారు.అదికూడా చాలా ఖరీదువి తెచ్హేవారు. అందరూ చాలా బాగున్నాయని మురుసుకునేవారు.అమ్మమ్మ పొద్దుగూకిన తరువాత అన్నయ్యలకి,నాకు దిష్టి తీసేది. అందరికళ్ళు నా పిల్లల్లమీదే ఉన్నాయని ఉడుక్కునేది. తిరిగి వచ్చేటపుడు అమ్మ ఎంతమందికి చెప్పిరావాలో.మేము కూడా చిన్న తాతా,అమ్మమ్మ,మామయ్యలు,పిన్నులు,మామ్మలు,ముత్తవ్వలు అందరికీ చెప్పి,అమ్మమ్మ ఇచ్చిన పిండి వంటలు క్యానులకు సర్దుకుని,తాతయ్య బుస్ ఎక్కించటానికి రోడ్డు వరకూ బండి కట్టించేవారు. మద్య మద్యలో చిన్న చిన్న ఊర్లు వచ్చేవి. పెద్దవాళ్ళు కొందరు ఎవరు?ధర్మరాజు(మా తాత గారి పేరు)అని అడిగితే పెద్దమ్మాయ్ వచ్చింది పండుగకి,తిరిగి పంపుతున్నా,అని తాత చెప్తూ అలా మెయిన్ రోడ్డుకి చేరుకునే వాళ్ళం.తలకటూరు వచ్చి విజయవాడ బస్ ఎక్కేవాళ్ళం.బండిలో వస్తూ వుంటే పొలాల్లో రకరకాల పిట్టల కూతలు,ఆ ప్రకృతి ఎంత అందంగా ఉండేవో.ఇవన్నీ మోసుకుని విజయవాడ చేరే వాళ్ళం. ఇప్పటికీ ఆయా పిట్టల తాలూక శబ్దాలు వినిపిస్తే నేను నా బాల్య స్మృతుల్లోకి వెళ్ళిపోతాను.

       ఈ ఙాపకాలను ఎప్పుడన్నా ఎవరితోనైనా పంచుకుందామనుకుంటే వినే వారేరి?పిల్లలు కూడా అబ్బా మమ్మీ...అంటారు.పెద్దన్నయ్య, నేనే ఇంకా ఈ ఙాపకాలను నెమరువేసుకుంటూ వున్నాం.నిజంగా ఆ రోజులే బాగున్నయ్.ఏదో అంటారు కదా"కాకై కలకాలం బతికే కన్నా,హంసలా ఆరు నెలలు బతికితే చాలని".అలా ఆస్తులు,ఆడంబరాల ఈ జీవితం కన్నా,కల్లా కపటం తెలియని అలాంటి మనుషులు,ప్రేమలు తప్ప మరొకటి తెలియని మనుషుల మద్య అటువంటి బాల్యం మళ్ళీ పొందాలని ఉంది.దేవుణ్ణైనా అదే కోరుకుంటున్నా.వెలలు కల ఈజీవితమొద్దు,వెలకట్టలేని నా బంగారు బాల్యాన్ని నాకివ్వమని.

     బోరు కొట్టిస్తే ఈ పోస్టు చదివిన వారు మన్నించండి.ఈ రోజు ఆ "ఆలోచనలు"బ్లాగు చూసి చదవకపోయినట్లైతే బహుశా ఈ నా స్మృతులన్నీ నాతో,నాలోనే నిక్షిప్తమైపోయేవేమో.ఏమొ మీ అందరితో పంచుకోవాలనిపించింది.చెప్పాను.చదివి మీ స్పందనలు చెప్పండి.          

Tuesday 6 January 2015

పాత్రో గారి ఙాపకాలలో:

           అవి నేను ఇంటర్ చదివే రోజుల్లో వచ్చిన సినిమా "సంసారం ఒక చదరంగం".అప్పటిలో వినోదవస్తువంటే టివికూడా కాదు,ఒక్క రేడియోనే.అందులో 'నీరాజనం' అని ఒక సినిమా ప్రొమోషన్ కార్యక్రమం వచ్చేది. అందులో ఆ ఆ సినిమాలకు సందించిన సన్నివేశాలు,పాటలు,వాటిని రచించినవారిగూర్చి,మాటల రచయతలగురించి,సంగీతం,నృత్యం మొదలగు విషయాలగురించి వినిపించేవారు. నేను కళాశాలకు బయలుదేరే సమయంలో ఈ కార్యక్రమాలు వచ్చేవి. అలా ఆ సినిమాలో సంభాషణలు బాగా గుర్తుకువుండి పోయాయి. అంతేకాదు ఆయా సంభాషణలు ఆ ఎదిగీ ఎదగని వయసులో ఆలోచనలను కలిగించేవి. గొల్లపూడి గారేమిటి,నూతన్ ప్రసాద్ గారు,ఇక సుహాసిని గురించి చేప్పేదేముంటుంది.నటనకు ఆమే ఆ కాలంలో ప్రతిరూపంగాఉండేది. సినిమా అంతా ఆమెకి పెద్ద సంభాషణలు ఉండవు.చివరిలో అందుకుంటుంది.మామగారిని,ఎదురించడం కాదు అక్కడ.ఒక కుటుంబంలో విభిన్న మనస్తత్వాలుకల వ్యక్తులమద్య నలిగిపోయిన ఒక కోడలి పాత్రకి ఆమె జీవం పోశారు. దానికి సుహాసినిగారి నటనకి,మన 'పాత్రో'గారి మాటలు కలసి ఎంతబాగుంటుందంటే. చివరిగా అందరం కలసే ఉందామని ఆమె మామగారు కోడలితో అంటే వద్దని సుహాసిని అన్నపుడు వారి వారి హావ భావాలు చూడాలి.నేనైతే ఈ సంభాషణలు వినీ వినీ తప్పకుండా చూడాలని చూసిన సినిమా.చివరిలో సుహాసిని అంటుంది...ఇదేమిటి అందరూ కలసి ఉండాలని కోరుకోవలసిన కోడలు విడిపోదామంటుంది అని ఆశ్చర్య పోకండి.ఉమ్మడి కుటుంబమనేది రకరకాల పూవులతో అల్లిన దండలాంటిది.దాన్ని అందరం చించి ఎవరిష్టమొచ్చినట్లు వారు ముక్కలు ముక్కలు చేసేశాం.ఇక దాన్ని మళ్ళీ గుచ్చలేం,అలాగే విరిగిన మనుషుల మన్సులను అతకగలమా? అతకలేం. కాబట్టి విడి పోదాం,విడిపోయి కలసిఉందాం. ఎప్పుడూ కలసి కొట్లాడుకునే కంటే విడిపోయి అప్పుడపుడూ, అంటే పండగలకు పబ్బాలకు కలుసుకుందాం.బాగున్నారా...అంటే బాగున్నారా! అని ఆప్యాయంగా పలుకరించుకుందాం.ఒకసారి మీరు రండి,ఒకసారి మేమువస్తాం.అని చెప్తూ ఒక వైరాగ్యపు మాట కూడా అంటుంది "కలసి ఉంటే లేదు సుఖం"అని.

        నేను ఈ పోస్టులొ వ్రాసిన సంభాషణలన్నీ ఇప్పుడే వ్రాశాను. అసలు మళ్ళీ సినిమా చూడనుకూడా చూడలేదు. ఐనా నాకు ఈ సంభాషణలు అంతలా గుర్తు ఉండిపొయాయ్.ఈ మాటలంటే పాత్రో గారు,సుహాసినిగారే గుర్తుకు వస్తారు.ఆతరువాత సీతారామయ్య గారి మనుమరాలు.కేవలం మాటల కోసం చూసా.ఎన్ని మంచి మాటలుంటాయ్ ఆ సినిమాలూఅ కూడా.భార్య చనిపోయిన తరువాత పర్వతమంత నాగేశ్వరావు గారు కుదేలై మనుమరాలితో మీ నాన్నను పిలుపించమ్మా,మీ నానమ్మ లేదు అనే సంఘటనలో వారి నటన,అక్కడి నుండీ నాగేశ్వరావుగారు,మీనా నటన,సన్నివేశాలను వేడెక్కించే సంభాషణలు.నేనైతే గుండె దిటవుగా వున్న సమయంలోనే చూస్తా ఈ సినిమాని. ఏ కాస్త నా మనసు బాగోకున్నా టివిలో ఈ సినిమాని మొదటి భాగం చూసి వదిలివేస్తా.

       ఇక మరో చరిత్ర గురించి నేను ఏమి చెప్పగలను.ఎన్ని సార్లు చూశానో .ఎప్పటికీ కొత్త ప్రేమకధలా నాకనిపిస్తుంది.'అందమైన అనుభవం'లో కూడా సన్నివేశాలు,బరువైన మాటలు మనసును పిండేస్తాయ్.


      నిన్న బాలచందర్ గారు,నేడు వారిని వెన్నంటినట్లే పాత్రో గారువెళ్ళిపోయారు. సారమంతా పోతుంది.ఇక మిగిలేది పిప్పేనని అనిపిస్తుంది.మొన్న బాపూ,రమణలు,నాగేశ్వరావుగారు,అంజలీదేవి
ఇంకెవరున్నారు వారిని భర్తీ చేయటానికి. కాలంతో పాటే మనుషులూ,మమతలూ,రచనలూ,కళలూ,అన్నీ కలుషితమే. ఏమో ముందునాటికైనా మరలా అటువంటి మహానుభావులు పుడతారని,పుట్టాలని ఆశిస్తూ. బాలచందర్ గారికి,గణేష్ పాత్రో గారికి నివాళులు అర్పిస్తూ,


                                       లక్ష్మీస్ మయూఖ.


  •          

కనుమరుగైన తెలుగుతనం:


  •         ఎన్నాళ్ళైనంది ఇంతటి తెలుగు తనాన్ని హూసి. ఇక ముందు చూస్తామన్న ఆశ కలగటం లేదు ప్రస్తుతమున్న పరిస్తితులలో. నానాటికి కనుమరుగౌతున్న తెలుగుతన్నాన్ని ఇకముందు ఇలా చిత్రాలలో చూసి కరువుతీర్చుకోవాల్సి వస్తుంది.చిత్రించిన కళాకారులందరూ నెమ్మదిగా కనుమరుగౌతున్నారు.అదే బెంగగా ఉంది.